Pages

Sunday, August 22, 2010

శ్లోకం - 12

దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతౌ పునరాయాతః|
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః||

శ్లోకం అర్ధం : రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చుచు పోవుచుండును. ఈ విధముగా కాలము క్రీడించుచున్నది, ఆయువు క్షీణించుచున్నది. అయిననూ ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయే ఉన్నది.

తాత్పర్యము : మానవ జీవిత పరిమితి వంద సంవత్సరములు. అందులో మన దురలవాట్ల వల్ల, రోగముల వల్ల, వ్యాధుల వల్ల, ఆపదల వల్ల ఆ జీవితకాలము ఎంతో తరగిపోవుచున్నది. అందులో సగభాగము మనము నిద్రలో గడుపుచున్నాము. తిండి, క్రీడలు, వినోదములకు చాలా భాగము వినియోగించు చున్నాము. ఆ మిగిలిన కొంత భాగమైనను భగవంతుని సేవకై వినియోగించక, పర దూషణలు, నిందలు, కామ క్రీడాది కార్యక్రమములకై వినియోగించు చున్నాము. ఈ విధంగా మన జీవితకాల మంతయు గడిచి పోవుచున్నది. స్వామి సేవ రేపు, మాపు అనుకొంటూ లేని పోని సాకులతో కాలయాపన చేయుచున్నాము. ఈ విధంగా గంటలు, రోజులు, పక్షములు, మాసములు, సంవత్సరములు గడిచి పోవుచున్నవే కాని, భగవత్ ధ్యానానికి ఒక క్షణము వెచ్చించుట లేదు. ఈ విధంగా మనకు ఎన్నో జన్మలు గడిచినవి, గడచును కూడా! మానవ జన్మము బహు దుర్లభమైనది. అది చేజారిన మరల దొరుకుట కష్టము. కావున, ఉన్న సమయమునైనా భగవత్ చింతనలో గడిపి, జీవితము సఫలము చేసుకొనుము. 

No comments:

Post a Comment