Pages

Sunday, August 22, 2010

శ్లోకం - 4

నలినీదళగత జలమతి తరళం
తద్వజ్జీవితమతిశయచపలం |
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||

శ్లోకం అర్ధం : తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి, జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము.

తాత్పర్యము : నావి అని భావించు ఈ బాహ్య వస్తువులే కాదు, ఈ శరీరము కూడా మన సొంతము కాదు. ఒక్క క్షణములో అవి మనలను వదిలి పోవును. తామరాకుపై నీటి జలము ఎంత అస్థిరమో, మన బ్రతుకు కూడా అంత చంచలము, అస్థిరము. ఏ క్షణమునైనా అది జారిపోవును, నీటి బుడగలా రాలి పోవును. కనుక ఈ బాహ్య వస్తువులను నమ్ముకొని వాని వెనుక పడుట, ఎండమావుల వెనుక పడి దాహము తీర్చుకొన ప్రయత్నించిన దానితో సమానము. అందుకే పామరులు బాహ్య వస్తు సముదాయముపై మోహము పెంచుకొని, వానిపై అనుబంధమును ఏర్పరుచుకొని, అవి ఉన్నంత వరకు సంతోషము, అవి దూరమైనప్పుడు అత్యంత శోకము అనుభవిస్తున్నారు. కావున, వస్తు సముదాయములు శాశ్వతమైన సంతోషమునందింప జాలవు. నిత్యమైన ఆనందము కావలెనన్న దేహాభిమానము వదలి, భక్తి, జ్ఞాన ప్రపత్తుల అవలంబించి, వైరాగ్య భావనతో, పరతత్వ సాధనలో శాశ్వతానందము బడయుము. శరణాగతితో శ్రీహరి చరణ కమలములు కోరి శాంతి నొందుము.

No comments:

Post a Comment