యోగరతో వా భోగరతోవా
సఙ్గరతో వా సఙ్గవిహీనః|
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ||
శ్లోకం అర్ధం : యోగమునందు ఆసక్తి కలవాడైనను, భోగమునందు ఆసక్తి కలవాడైనను, ఏకాంతముగా నుండువాడైనను, బంధుమిత్రులతో కలిసి ఉన్నవాడైనాను, తన మనస్సును పరబ్రహ్మమునందు ఏకాగ్రతతో లగ్నము చేసి వినోదించువాడు ఎల్లప్పుడునూ ఆనందమును అనుభవించుచున్నాడు.
తాత్పర్యము : ఆత్మజ్ఞానముతో పరబ్రహ్మ స్వరూపము నెరిగిన వ్యక్తికి ఎచ్చట ఉన్ననూ, ఎప్పుడైననూ, హృదయములో సంపూర్ణ ఆనందము నిండి ఉండును. అట్టి ఆనందము సంసారిక సుఖముల వల్ల ఎన్నటికీ లభించదు. వస్తు విషయముల వల్ల వచ్చు ఆనందము అసంపూర్ణము, అనిత్యము. కాని పరతత్వ జ్ఞానము వల్ల లభించిన ఆనందము పరిపూర్ణము, నిత్యము. అట్టి ఆనందము పొందు వ్యక్తి యోగ యుక్తుడుగా ఉండినను, భోగ యుక్తుడుగా ఉండినను, లేక సంసార బంధములలో కూరుకుని ఉండినను ఆ ఆనందమును పొందుచునే ఉండును. అనగా, తామరాకు మీద నీటి లాగ తాను ఎచ్చట ఉండిననూ, వానితో మనసు ముడి పెట్టుకొని ఉండక, తన కర్తవ్యము తాన నిర్వర్తించుచూ, మనస్సును భగవంతునిపై లగ్నము చేసి ఆ తన్మయత్వములో పరమానంద భరితుడై ఉండును.
No comments:
Post a Comment