Pages

Saturday, August 21, 2010

శ్లోకం - 16

అగ్రే వహ్నిః పృష్ఠే భానూ
రాత్రౌ చుబుకసమర్పితజానుః|
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాశః||

శ్లోకం అర్ధం : తనవారితో గల సంబంధముల నన్నిటిని విడిచి, చెట్ల నీడలలో నివసించుచు, రాత్రులందు చలికి ముడుచుకుని, మోకాళ్ళపై గడ్డమును ఉంచుకుని పండుకొనుచు, పగలు సూర్యుని ఎండను ఆశ్రయించుచు, చేతిలో పడవేసిన భిక్షాన్నమును తినుచూ గడుపుచున్నను ఆశ మాత్రము వదిలి పెట్టదు. 

తాత్పర్యము : మొక్షాసక్తులు వదలవలసినది వాసనలు, వ్యామోహము, ఆశలు కాని వస్తు సముదాయములు కాదు. భౌతిక వస్తువులు త్యాగము చేసినంత మాత్రమున మోక్షప్రాప్తి జెరగదు. కొందరు ఇళ్ళు వదలి, బైరాగులై, భిక్షాటనతో పొట్ట గడుపుకొనుచు, ఏ చెట్టు కిందనో జీవించుచు, చలి, ఎండ, వానలు భరిస్తూ మోక్షము వచ్చునని కలలుగందురు. కాని బాహ్య వస్తువులు, సుఖముల నన్నిటిని త్యాగము చేసినా, వారు మనసుకు పట్టిన ఆశ, అరిషడ్వర్గములు, మానసిక దోషములు, కోపతాపములు, వాసనలు వదులు కొనలేక పోవుచున్నారు. ఆ కారణము వలననే వారికి మోక్షము గగన కుసుమము అగును. మనసు మాధవునిపై లగ్నము చేయక, కేవలము పెద్దగా సంస్కృత మంత్ర పఠనము, ఆడంబరమైన పూజలు, గుళ్ళ యందు అర్చనలు, అభిషేకములు, వ్రతములు, ఉపాసనలు, భగవత్ గీత, భాగవత పఠనలు మొదలగు బాహ్య కార్యకలాపములు చేయుచూ, తాము భక్తులమని, గురువుల మని, అందరికన్నా ఉత్తములమన్న భ్రమలో పడి మోక్ష ప్రాప్తిని ఆశింతురు. కాని భగవంతునిపై ఏకాగ్రత, స్థిర చిత్తము లేక ఈ కార్యకలాపములు కేవలము నటనలుగనే కాని, మానవుని బంధ విముక్తుడిని చేయలేవు. మనసు మాధవునిపై స్థిరముగా లేక వెయ్యి సార్లు విష్ణు సహస్రనామ పఠనము కన్నా, ఒక్కసారి భక్తిగా మనస్సు పెట్టి గోవిందా అని తలపోసిన గొప్ప ఫలితము దక్కును. కావున బాహ్య ఆడంబరములు కన్నా, వస్తు త్యాగములు కన్నా దుర్వ్యసనా త్యాగము, హృదయ స్థిరత్వము మోక్షదాయకములగును.

No comments:

Post a Comment